అలిమేలు మంగమ్మకు ఆ పేరు ఎలా వచ్చింది?

తిరుమల శ్రీనివాసునికి నిర్వహించినట్టే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సైతం ప్రతి ఏటా కార్తీక మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలుసుకున్నాం. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి ప్రారంభమై డిసెంబర్ 6 వరకూ జరగనున్నాయి. పద్మావతి అమ్మవారికి అలిమేలు మంగమ్మ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. తమిళ భాషలో ‘అలర్’ అనగా పువ్వు, ‘మేల్’ అనగా పైన.. ‘మంగై’ అనగా అందమైన స్త్రీ. అలమేలుమంగై అంటే తామరపువ్వులో జన్మించిన పద్మావతి అని అర్ధం. అందుకే పద్మావతి అమ్మవారిని అలిమేలు మంగమ్మ అని కూడా పిలుస్తారు.

వేదవతిని పద్మావతి అమ్మవారని చెబుతారు. త్రేతాయుగంలో శ్రీరాముడిని వివాహమాడాలని ఆశపడిన వేదవతికి మరుజన్మలో పెళ్లాడుతానని శ్రీరాముడు మాట ఇచ్చాడట. ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించిందట. ఆ తరువాత శ్రీనివాసుడిని వివాహం చేసుకుంది. శ్రీనివాసుడు శిలగా మారినపుడు లక్ష్మీదేవి కొల్హాపూర్‌లో వెలసింది. వేంకటాచల మహత్యం ప్రకారం.. శ్రీనివాసుడు శిలగా మారిన అనంతరం పద్మావతి అమ్మవారు అలమేలుగా తిరుచానూరులో వెలసిందట. అమ్మవారు కార్తీకమాసంలో వెలిసిందని తెలుసుకున్నాం. కాబట్టి బ్రహ్మోత్సవాలను కార్తీక మాసంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు.

Share this post with your friends