
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం రాత్రి హంస వాహన సేవలో 12 కళా బృందాలకు చెందిన 256 మంది కళాకారులు తమ నాట్య ప్రావీణ్యాన్ని ప్రదర్శించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు హంస లక్ష్ములు, నెమలి నృత్యం, కైల్కుట్టి కాళి, జానపద నృత్యం, గరగల్లు, కోలాటాలు వంటి పలు ఆసక్తికరమైన నృత్యాలు భక్తులకు కనువిందు చేశారు.
శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ మహిళా ఉద్యోగుల సారె
తిరుచానూరులో జరుగుతున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం టీటీడీ మహిళా ఉద్యోగులు శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి, ఉన్నతాధికారుల సతీమణులతో పాటు టీటీడీ మహిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
