సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి కటాక్షం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం ఉదయం 7 గంటలకు గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంంగళవాయిద్యాల నడుమ వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రధాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి.

అటువంటి సూర్యప్రభను అధిష్టించి స్వామి ఊరేగడం ఆనందదాయకం. అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు సతీసమేతంగా గోవిందరాజస్వామివారికి స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, చందనంతో అభిషేకం చేశారు. రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వాహన సేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆల‌య డెప్యూటి ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends