దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ తీసుకుంటున్న సంకల్పానికి అస్సాం ప్రభుత్వం మద్దతు పలికింది. గువాహటిలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం తొలుత ప్రతిపాదించిన 10.8 ఎకరాల స్థానంలో ఏకంగా 25 ఎకరాల భూమిని కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మల మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం ఖరారైంది. ఈశాన్య భారతదేశానికి కేంద్రంగా ఉన్న గువాహటిలో ఆలయం నిర్మిస్తే భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని చంద్రబాబు సూచించారు. నిత్యాన్నదానం, భక్తుల వసతి వంటి కార్యక్రమాలకు విశాల స్థలం అవసరమని పేర్కొన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అస్సాం ప్రభుత్వం భూమితో పాటు ఆర్థిక సహాయానికి కూడా అంగీకరించడం విశేషం. ఈ నిర్ణయం సనాతన ధర్మ విస్తరణకు మరొక మైలురాయిగా భావిస్తున్నారు.

