
దేశమంతా ఈ రోజు వరలక్ష్మి వ్రతాన్నిపెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా అన్ని దేవీ ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమ్మవారిని తమకు తోచిన రీతిలో అందంగా అలంకరిస్తున్నారు. కర్ణాటకలో అయితే కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. కరెన్సీ నోట్ల నడుమ లక్ష్మీదేవి మరిం శోభాయమానంగా వెలిగిపోతోంది. మాండ్య జిల్లా శ్రీరంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మిదేవిగా దర్శనమిచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగున్నర లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. దీనికోసం రూ.10 నుంచి రూ.500 నోట్లను సేకరిచారు.
కళాకారుడు సందేశ్ కళావిడ, బృందం ఆధ్వర్యంలో అమ్మవారి అలంకరణ జరిగింది. ఈ ఆలయాన్ని వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెల్లవారు జాము నుంచే అలంకరణ కోసం రూ.10 నుండి రూ.500 వరకు కరెన్సీ నోట్లను ఉపయోగించారు. ఈ అలంకరణ ధనలక్ష్మి రూపంలో ఉన్న లక్ష్మిదేవికి చిహ్నమని ఆలయ పూజారులు చెప్పారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీరంగపట్నంలోని ఈ అమ్మవారి ఆలయంలో దుర్గాదేవి స్వరూపమైన చాముండేశ్వరీ దేవి కొలువై ఉంది. స్కంద పురాణం వంటి పురాతన గ్రంథాలలో సైతం ఈ ఆలయ ప్రస్తావన ఉంది. తరువాతి కాలంలో ఈ ఆలయం మైసూర్ వడయార్ రాజవంశంతో అనుబంధం కారణంగా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. మైసూర్ రాజవంశీయులు ఈ అమ్మవారిని తమ సంరక్షక దేవతగా కొలుస్తారు. ఇక్కడ సతీదేవి తల వెంట్రుకలు పడిపోయాయని చెబుతారు.
