తిరుమల తిరుపతి దేవస్థానానికి బెంగుళూరుకు చెందిన ఒక వ్యక్తి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు.బెంగుళూరుకు చెందిన బీఎంకే నగేష్ అనే భక్తుడు టీటీడీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి దాత తరఫున విరాళం డీడీని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అందజేశారు. కాగా.. వరుస సెలవులు, వీకెండ్ కూడా కావడంతో తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది.
వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరిలోని నాలుగు షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయారు. టోకెన్ లేని భక్తులకు దాదాపు 18 గంటల దర్శన సమయం పడుతోంది. స్లాటెడ్ టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు నాలుగు గంటల దర్శన సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరిగిపోవడంతో అకామిడేషన్ సమకూర్చడం టీటీడీకి తలకు మించిన భారంగా మారింది. భక్తులు గదుల కోసం క్యూలైన్లలోనే గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు, మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.