
తిరుపతి శ్రీ కోదండ రామస్వామివారికి రూ.4.10 లక్షల విలువైన బంగారు పూత వేసిన రాగి ఆభరణాలను బుధవారం చెన్నైకి చెందిన భక్తులు విరాళంగా అందజేవారు. చెన్నైకి చెందిన శ్రీధర్, వారి కుటుంబ సభ్యులు కానుకగా సమర్పించారు. ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నకు వీటిని అందించారు. బహుకరించిన వాటిలో ఉత్సవమూర్తులకు అలంకరించే ఆరు హస్త కవచాలు, ఆరు పాద కవచాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి,ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ ముని శంకరన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్,ఆలయ అర్చకులు శ్రీ ఎపి.ఆనందకుమార్ దీక్షితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
