ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మరోసారి సరికొత్త టూర్ ప్యాకేజీతో సిద్ధమైపోయింది. కర్ణాటకలోని పలు ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలతో పాటు బీచ్లో ఎంజాయ్ చేయాలనుకునేవారు ఈ టూర్ ప్యాకేజీ ద్వారా తక్కువ ఖర్చుతో తిరిగి రావచ్చు. ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. దీనిలో కర్ణాటకలోని తీర ప్రాంతాలైన మురుడేశ్వర్, శృంగేరి, ఉడిపి వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించుకోవచ్చు. కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ కింద అందుబాటులోకి వచ్చిన దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తొలిరోజున అంటే 29న కాచిగూడ-మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్(నెంబర్ 12789) ట్రైన్ ఉదయం 6.05 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు రెండవ రోజు ఉదయం 10 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్కు చేరుతుంది. ఇక్కడ నుంచి ఉడిపికి వెళ్లి అక్కడ హోటల్లో ఫ్రెష్ అయి.. ఉడిపిలోని శ్రీ పాండు రంగ ఆలయాన్ని సందర్శిస్తారు. తరువాత మాల్పె బీచ్ కు వెళ్లొచ్చి రాత్రి ఉడిపిలోనే బస చేస్తారు. మూడో రోజు ఉదయం ఉడిపి నుంచి కొల్లూరు మూకాంబిక ఆలయ దర్శనానికి వెళ్లి అక్కడి నుంచి మురుడేశ్వర్కు చేరుకుంటారు. అక్కడి భారీ శివయ్యను దర్శించుకుని సాయంత్రానికి గోకర్ణకు చేరుకుంటారు. గోకర్ణలో దేవాలయ సందర్శనం అనంతరం బీచ్కి వెళ్లి రాత్రికి తిరిగి ఉడిపి చేరుకుని అక్కడే బస చేస్తారు.
నాలుగో రోజు ఉదయం ఉడిపి హోటల్ చెక్ అవుట్ చేసి హోర్నాడుకు వెళ్లి అక్కడ అన్నపూర్ణ దేవి ఆలయాన్ని దర్శించుకోవాలి. అక్కడ నుంచి శృంగేరికి చేరి శారదాంబను దర్శించుకుని సాయంత్రానికి మంగుళూరుకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. ఐదో రోజు మంగళూరులోని మంగళాదేవి, కద్రి మంజునాథ, కుండ్రోలి గోకర్నాథ ఆలయాలను దర్శించుకుని తన్నేర్బవి బీచ్లో ఎంజాయ్ చేయడంతో ఈ టూర్ ముగుస్తుంది. ఇక్కడ నుంచి మంగళూరు రైల్వేస్టేషన్కు చేరుకుని రాత్రి 7 గంటలకు కాచిగూడకు తిరుగు ప్రయాణమవుతారు.
టికెట్ ధరలు
కంఫర్ట్ క్లాస్లో సింగిల్ షేరింగ్- రూ.39,140.. డబుల్ షేరింగ్- రూ.22,710.. ట్రిపుల్ షేరింగ్- రూ.18,180
5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు విత్ బెడ్- రూ.11,610.. విత్ అవుట్ బెడ్- రూ.10,210
స్టాండర్డ్ క్లాస్లో సింగిల్ షేరింగ్కు -రూ.36,120, డబుల్ షేరింగ్- రూ.19,690, ట్రిపుల్ షేరింగ్ -రూ.15,150
5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు విత్ బెడ్- రూ.8,590, విత్ అవుట్ బెడ్- రూ.7,190
ప్యాకేజీలో ప్రయాణీకులకు కల్పించే సౌకర్యాలు
ట్రావెలింగ్ ప్యాకేజీ ఎంపిక ఆధారంగా టూర్లో ప్రయాణించేందుకు ఏసీ వెహికల్, హోటల్ అకామిడేషన్, మూడు రోజులు అల్పాహారం, ప్రయాణ భీమా సౌకర్యం
ఏప్రిల్ 29వ తేదీన ప్రారంభమయ్యే ఈ టూర్ ప్యాకేజీ మే 6, 13, 20 , 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో అందుబాటులో ఉండనుంది.