తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మే 9 నుంచి పెద్ద ఎత్తున వైభవంగా బుగ్గోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీ వరకూ బుగ్గోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ మహాద్వారానికి ఎదురుగా ఉన్న బుగ్గ పుష్కరిణీ వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేస్తారు.
మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆస్థానం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఉభయనాంచారులతో కలసి స్వామివారి ఊంజలసేవ అనంతరం బుగ్గ వద్ద భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు శ్రీ మహలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ఆస్థానం నిర్వహించనున్నారు.