టీటీడీ స్థానికాలయాల్లో వైభవంగా బ్రహ్మోత్సవాలు

దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీకి చెందిన పలు స్థానిక ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో ఆదివారం ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో… పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో ఆదివారం సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముందుగా ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు.
రాత్రి 7 గంటల నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారికి పెద్ద ఎత్తున వాహన సేవలు నిర్వహిస్తున్నారు.

జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో…

వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముందుగా ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఇందులో భాగంగా విష్వ‌క్సేన పూజ, కలశ‌ ప్ర‌తిష్ట‌, వాసుదేవ పుణ్యాహ‌వాచనం, నవక‌లశ‌ ఆరాధన, ధ్వ‌జ‌స్థంభానికి అభిషేకం నిర్వ‌హించారు.

న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో…

న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 6 నుండి 8.07 గంటల మ‌ధ్య వృషభ ల‌గ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తున్నారు. మే 20వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

రిషికేష్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో…

ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్ జిల్లా, రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఉద‌యం 10.50 నుండి 11.15 గంట‌ల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

Share this post with your friends