ఆదిలాబాద్‌లో పెద్ద ఎత్తున అయ్యప్పస్వామి ఆరట్టు ఉత్సవం

దేశమంతా అయ్యప్ప స్వామి సేవలో తరిస్తోంది. కార్తీక మాసంలో పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప మాల ధారణగావించారు. ఎక్కడ చూసినా స్వామివారి భజనలు, పడిపూజలతో భక్తి భావం వెల్లివిరుస్తోంది. ఆదిలాబాద్ లో శ్రీ అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం నుంచి ఆదివారం ఉదయం ఈ ఆరట్టు ఉత్సవాన్ని మాలధారులంతా ప్రారంభించారు. ఆదివారం ప్రారంభమైన ఆరట్టు ఉత్సవం పట్టణ పురవీధుల గుండా కొనసాగింది.

మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు ఆరట్టు ఉత్సవాన్ని ఆదిలాబాద్‌లో చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సపంలో పాల్గొన్నారు. ముందుగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి పట్టణం మొత్తం ఊరేగించారు. అయ్యప్ప స్వామి శోభాయాత్రలో అయ్యప్ప దీక్షదారులు, భక్తుల భజన కీర్తనలు, అయ్యప్ప స్వామి నామస్మరణతో పట్టణ పురవీధుల మారుమ్రోగాయి. కేరళ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన డోలు వాయిద్యాలు శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారి పొడవునా స్వామివారికి మహిళా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు.

Share this post with your friends