రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు.. 6 గంటల నుంచే భక్తులకు అనుమతి

తిరుమలలో ఫిబ్రవరి 1న ఆదివారం జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ తీర్థానికి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను అనుమతిస్తారు. ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు త‌దిత‌ర‌ పూజా సామగ్రిని శ్రీ రామకృష్ణ తీర్థానికి తీసుకెళ‌తారు. అక్క‌డున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భ‌క్తుల‌కు ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తారు.

భక్తులకు మార్గదర్శకాలు:

– 12 ఏళ్ల వయస్సులోపు ఉన్న చిన్న పిల్లలు, అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి అట‌వీ మార్గంలో ఈ తీర్థానికి న‌డిచి వెళ్ల‌డానికి అనుమ‌తి లేదు.

– పాపవినాశనం వద్ద భక్తులను మెడికల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే తీర్థానికి అనుమతిస్తారు.

– భక్తుల అత్యావసర వైద్యం అందించేందుకు ఈ మార్గంలో టీటీడీ రెండు అంబులెన్సులు, 4 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసింది.

– భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పాపవినాశనం మార్గంలో ఆరోజున ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను అనుమతించరు. గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ దాదాపు 40 బస్సులను ఏర్పాటు చేస్తోంది.

– ఈ తీర్థానికి వెళ్లే యాత్రికుల‌కు టీటీడీ అన్న‌ప్ర‌సాద విభాగం ఆధ్వ‌ర్యంలో మంచినీరు, మజ్జిగ, పాలు, కాఫీ, పొంగ‌ళి, ఉప్మా, సాంబార‌న్నం, పెరుగన్నం పంపిణీ చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Share this post with your friends