నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లీ సమేత అగస్తీశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1 నుండి 10వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు గణపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.మే 1వ తేదీ ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై అగస్తీశ్వరస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆలయ చరిత్రను పరిశీలిస్తే నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారు. స్వామివారి లింగాకారానికి పీఠభాగం అనగా బాణపట్టమును అమర్చి వేద ఆగమశాస్త్ర ప్రకారం శ్రీ అగస్త్య మహర్షులవారు ప్రతిష్ఠ చేసి పూజించినందువల్ల స్వామివారికి అగస్తీశ్వరస్వామి అని పేరు వచ్చింది.