అలిపిరి కాలినడక మార్గంలో అదనపు ఈవో త‌నిఖీలు

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి ఏడవ మైలు వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం అద‌నపు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి త‌నిఖీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అటవీ శాఖ, రాష్ట్ర అటవీశాఖ అధికారులతో కలిసి ఆయన కాలిబాట మార్గాన్ని పరిశీలించారు. న‌డ‌క‌దారిలో ఏర్పాటు చేసి ఉన్న స్టాటిక్ కెమెరాలు, మోషన్ సెన్సార్ కెమెరాల పనితీరును ఆయన సమీక్షించారు.

అటవీ ప్రాంతంలో మానవ–వన్యప్రాణి ఘర్షణ సమస్యను ఎదుర్కొనడానికి తాత్కాలికంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కొన్ని సూచనలు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ నిఘా వీజీవో శ్రీ రామ్ కుమార్, టీటీడీ అటవీ రేంజ్ అధికారి శ్రీ దొరస్వామి, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీ మధుసూదన్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలోని అలిపిరి మెట్లమార్గం, ఘాట్ రోడ్డుల వద్ద ఇటీవల కాలంలో వన్యమృగాలు, ముఖ్యంగా చిరుతపులుల కదలికలు పెరిగిన నేపథ్యంలో మానవ-వన్యప్రాణి ఘర్షణల నివారణ చర్యలపై తాజాగా గోకులం స‌మావేశ మందిరంలో ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం సైతం జరిగింది.

Share this post with your friends