శ్రీ మలయప్ప వాహన సేవలో నవ రాష్ట్రాల కళా వైభవం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో ఎనిమిదో రోజైన బుధవారం రాత్రి అశ్వ వాహ‌నసేవ‌లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఆక‌ట్టుకున్నాయి. దేశంలోని 9 రాష్ట్రాల నుంచి వచ్చిన 21 బృందాలకు చెందిన మొత్తం 539 మంది కళాకారులు పాల్గొని, తమ ప్రదర్శనలతో భక్తులను అలరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల కళాకారులు భారతీయుల సాంస్కృతిక సమైక్యతను చాటిచెప్పారు.

వాహన సేవకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అశ్వారూఢనం, తిరుపతి నుంచి కలియుగ వెంకటేశ్వర వైభవం, ఆంధ్రప్రదేశ్ నుంచి వేషధారణ వంటి ప్రత్యేక ప్రదర్శనలు భక్తులను ఆకర్షించాయి. శాస్త్రీయ నృత్య వైభవంతో కేరళ నుంచి సుప్రసిద్ధ మోహినియాట్టం, తమిళనాడు నుంచి భరతనాట్యం, పశ్చిమ బెంగాల్ నుంచి శాస్త్రీయ కళాఖండమైన గౌడీయ నృత్యం, తెలంగాణ, ఝార్ఖండ్‌ల నుంచి కథక్ నృత్యాలు ప్రదర్శించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి దశావాతారం, ఆండాళ్ పాశురాలు వంటి రూపకాలు, కర్ణాటక నుంచి జగన్నాథ రథయాత్ర ఉత్సవ నేపథ్య ప్రదర్శనలు భక్తి పారవశ్యాన్ని కలిగించాయి.

జానపద, సాంప్రదాయ నృత్యాలు, మహారాష్ట్రకు చెందిన భక్తి ప్రధానమైన వారకరి భజన, ఉత్తరాఖండ్‌కు చెందిన సుదీర్ఘ యాత్రా నేపథ్యం గల నందా రాజ్‌ జాట్ యాత్ర, కర్ణాటక నుంచి ఉద్వేగభరితమైన కంసాళ్ నృత్యం, తమిళనాడు నుంచి శక్తి డ్యాన్స్ వంటి జానపద కళలు ప్రత్యేకంగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక బృందాలు ఉమ్మడిగా ప్రదర్శించిన కోలాటం నృత్యాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రదర్శించిన డ్రమ్స్ బృందం ఉత్సవ వాతావరణాన్ని మరింత పెంచాయి.

Share this post with your friends