
తమిళనాడును దేవాలయాల రాష్ట్రంగా పిలుస్తారు. ఇక్కడ ఉన్నన్ని అతి ప్రాచీనమైన ఆలయాలు మరెక్కడా లేవంటే అతిశయోక్తి కాదు. ప్రాచీనమైనవే కాకుండా మహిమాన్విత ఆలయాలు సైతం ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాట స్కందుడు అంటే సుబ్రహ్మణ్యుని పెద్ద ఎత్తున ఆరాధించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో స్కందుని కందస్వామి అని కూడా తమిళనాడు భక్తులు పిలుచుకుంటారు. తమిళనాడులో ఒక ప్రముఖ కందస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో భక్తులకు ఓ తీర్థం ఇస్తారు. దానిని మహా ఔషధంగా భక్తులు తీసుకుంటారు. ఆ తీర్థమేంటి? అసలు కందస్వామి ఆలయ విశేషాలేంటి? తెలుసుకుందాం.
తమిళనాడులోని సేలం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో, నామక్కల్ తిరుచెంగోడే వెళ్లే మార్గంలో కాళీపట్టి కందస్వామి ఆలయం ఉంటుంది. ఇది కొన్ని శతాబ్దాల నాటి ఆలయం. లక్ష్మణ్ గౌండర్ అనే మురుగన్ భక్తుడు ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఈ ఆలయంలో భక్తులకు నలుపు రంగులో ఉండే తిరునీర్ను పంచిపెడతారు. ఇది ఈ ఆలయ ప్రత్యేకత. దీనిని స్వీకరిస్తే సకల రోగాలు మాయమవుతాయట. ఈ తిరునీర్ను చెరుకు పొట్టుతో తయారు చేస్తారు. ఈ తీర్థం చాలా మహిమాన్వితమైనదట. ఈ తిరునీర్ తయారు చేసేందుకు రైతులు తమ పొలాల్లోని చెరకును తీసుకెళ్లి ఆలయానికి అందజేస్తారు.
