రేపటి నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దుర్గాదేవి తొమ్మిది అవతారాలను ఈ తొమ్మిది రోజుల పాటు మనం పూనజించుకుంటాం. హిందూ మతంలో ఈ నవరాత్రికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ఈ సారి నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటు కాదు.. పది రోజుల పాటు నిర్వహించనున్నాం. అసలు ఎందుకు పది రోజుల పాటు జరుపుకోనున్నామో తెలుసుకుందాం. నవరాత్రులు ఆశ్వయుజమాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిసిందే. నవరాత్రులను ఈ నెల 11 వరకూ నిర్వహించుకున్న మీదట 12న మనం విజయదశమిని జరుపుకోనున్నాం.
దుర్గాదేవిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిగా తొమ్మిది రూపాల్లో తొమ్మిది రోజుల పాటు పూజించుకుంటాం. పదవ రోజున దసరా జరుపుకుంటాం. అయితే ఈసారి ఆశ్వయుజమాసం శుక్ల పక్షం ప్రతిపాద తేదీ అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 4 మధ్యాహ్నం 2:58 గంటలకు ముగుస్తుంది. కొన్ని పంచాంగాల ప్రకారం ఈసారి అష్టమి, నవమి తిథులు రెండూ అక్టోబర్ 11నే వచ్చాయి కాబట్టి నవమి తిథి పూజకు అనుకూలమైన సమయం అక్టోబర్ 12వ తేదీ. ఏ పండుగను అయినా కూడా ఉదయం తిథిలో జరుపుకుంటాం కాబట్టి ఆ లెక్కన శరన్నవరాత్రి ఉత్సవాలను మనం పది రోజుల పాటు నిర్వహించుకోనున్నాం.