
సప్తశృంగి అమ్మవారి గురించి మరో కథనం కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం. భీమాసురుడనే రాక్షసుడిని సంహరించాలని సప్తశృంగి అమ్మవారిని మార్కండేయ మహర్షి ప్రార్థించాడట. దీంతో అమ్మవారు ఏడు శక్తి రూపాల కలయికగా ఇక్కడ వెలసిందట. ఈ ఆలయంలోని గర్భాలయం రెండు అంతస్థుల్లో ఉంటుంది. అమ్మవారు వచ్చేసి 18 చేతులతో మనకు దర్శనమిస్తుంది. ప్రతి చేతిలో ఒక భిన్నమైన ఆయుధంతో కనిపిస్తుంది. అసుర సంహారం గావించిన తర్వాత వెలిసింది కాబట్టి ఉగ్ర స్వరూపంతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది.
ప్రధాన ఆలయంలోని అమ్మవారి విగ్రహం పది అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఏడు శిఖరాల మధ్య ప్రకృతి సౌందర్యంతో అలరారే కొండపై అమ్మవారు ఉంటుంది. ఇక కొండ దిగువన అంటే మెట్లు ఎక్కడం ప్రారంభించే చోట, రాతితో తయారు చేసిన గేదె తలను చూడవచ్చు. ఈ గేదె తల అనేది మహిషాసురుడనే రాక్షసుడిదని భక్తుల నమ్మకం. ఇక ఈ ఆలయ మరో విశేషం ఏంటంటే.. ఆలయం చుట్టూ అనేక తటాకాలు ఉన్నాయి. వాటిలో కాళీకుండ్, సూర్యకుండ్, దత్తాత్రేయకుండ్ అనే మూడు తటాకాలు ప్రధానమైనవి. ఈ కుండల్లో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి సమస్త అనారోగ్యాలు పోతాయని విశ్వాసం. ఈ అమ్మవారు మానసిక ఆందోళనలను తొలగించి, ధైర్యాన్ని, సంకల్ప బలాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
