నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను మే 01 నుంచి అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు మే 09 వరకూ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి స్థలపురాణం గురించి తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం, ‘సోమకాసురుడు’ అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలో దాచగా, శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి అతన్ని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందజేశారు. ఆ మహత్తర ఘట్టం జరిగిన పవిత్ర ప్రాంతమే నాగలాపురం. ఈ క్షేత్రంలో మత్స్యరూపంలో ఉన్న శ్రీహరిని మహాలక్ష్మి, పరమేశ్వరుడు దర్శించినట్లు విశ్వాసం ఉంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని “హరికాంతపురం” అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం పంచప్రాకారాలు, సప్తద్వారాలతో అద్భుత శిల్పకళతో నిర్మించబడింది. ప్రతి సంవత్సరం సూర్యకిరణాలు మూలవిరాట్ను స్పర్శించే విశేషం ఉంది. దీనినే “సూర్యపూజ”గా ఘనంగా నిర్వహిస్తారు.
