తిరుమలలో మనం చూడాల్సిన ముఖ్య తీర్థాలు మరో రెండు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. వాటిలో ఒకటి తుంబుర తీర్థం. శ్రీవారి ఆలయానికి ఉత్తరంగా సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వేంకటాచల మహత్స్యం ప్రకారం.. కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో ఒక ప్రళయం రావడంతో ఒక కొండ రెండుగా చీలిపోయి తుంబుర తీర్థం ఏర్పడిందట. ఈ తీర్థంలోనే శ్రీ మలయప్ప స్వామివారి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ తన అవసానదశను గడిపిందట. దీనికి నిదర్శనాలు సైతం ఉన్నాయి. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు కుమార తీర్థం మాదిరిగానే ఇక్కడ ముక్కోటి నిర్వహిస్తారు. కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే ఈ తీర్థాన్ని సందర్శించేందుకు భక్తులను అనుమతిస్తారు.

ఇక మనం తిరుమలలో చూడాల్సిన వాటిలో శ్రీ రామకృష్ణ తీర్థం కూడా ఉంది. ఇది శేషాచల అడవుల్లోని పుణ్య తీర్థాల్లో శ్రీ రామకృష్ణ తీర్థం కూడా ఒకటి. వేంకటాద్రిపై తపస్సు చేసిన శ్రీ రామకృష్ణ మహర్షి తాను స్నానమాచరించేందుకు గానూ ఓ తీర్థాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పేరు మీదుగానే ఆ తీర్థానికి శ్రీ రామకృష్ణ తీర్థంగా పేరు వచ్చిందని స్కంద పురాణం చెబుతోంది. స్థల పురాణం ప్రకారం.. ఈ తీర్థ తీరంలోనే నివసిస్తూ శ్రీ రామకృష్ణ మహర్షి కఠోర తపస్సు ఆచరించారట. ఆయన తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారంతో ఆయన ముక్తి పొందారట. ప్రతి ఏటా పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు శ్రీ రామకృష్ణ తీర్థం ముక్కోటిని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇవి మాత్రమే కాకుండా తిరుమల గిరుల్లో మరికొన్ని తీర్థాలు సైతం ఉన్నాయి.
