రుద్రనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో సముద్ర మట్టానికి 2290 మీటర్ల ఎత్తులో విరాజిల్లిన పంచ కేదారాల్లో మూడవదిగా ప్రసిద్ధి చెందింది. వృషభ రూపంలో ఉన్న మహా శివుని శరీర భాగాలు భూమిపై ఐదు చోట్ల పడగా… అందులో ముఖ భాగం ఇక్కడి రుద్రనాథ్లో పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ శివలింగానికి బదులుగా ఉగ్ర స్వరూపంలో ఉన్న స్వామి ముఖాన్ని పూజిస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచ పాండవుల విగ్రహాలు, కుంతిదేవి, ద్రౌపది, స్థానిక వన దేవతలు, యక్ష దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. సమీపంలోని పాండవ సెరలో పాండవులు వ్యవసాయం చేసిన భూమి, నీటి కాల్వలు ఇప్పటికీ మనకు దర్శనమిస్తాయి. రుద్రనాథ్ యాత్ర అత్యంత కష్టతరంగా ఉంటుంది. గోపేశ్వర్, గంగోల్గావ్, జోషిమఠ్ మార్గాల ద్వారా ట్రెక్కింగ్ చేస్తూ ఇక్కడికి చేరుకుంటారు. కష్టతరమైన ఈ యాత్రను జీవితంలో ఒక్కసారైనా చేయాలని భక్తులు చెబుతున్నారు.

