దేవతలకు గురువుగా బృహస్పతిని చెబుతారు. జ్ఞానానికి, అదృష్టానికి, సంపదకు అధిదేవతగా బృహస్పతిని పేర్కొంటారు. గురువును నవగ్రహాల్లో శుభ గ్రహంగా, కీర్తి, సంతానం, విద్యను ప్రసాదించే వాడిగా జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. గురు గ్రహ అనుకూలత లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కోసం బృహస్పతి ఆలయాలు సందర్శించాలని పురాణాలు చెబుతున్నాయి. మన దేశంలో బృహస్పతి ఆలయాలు చాలా అరుదు. అలాంటి వాటిల్లో ఒకటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసిలో ఉంది. ఈ కథనంలో వారణాసిలో వెలసి ఉన్న బృహస్పతి మందిర్ విశేషాలు తెలుసుకుందాం.

ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో వెలసిన విశ్వనాథుని ఆలయానికి కేవలం కిలో మీటర్ దూరంలో ఉంటుందీ బృహస్పతి ఆలయం. దశాశ్వమేధ్ ఘాట్ నుంచి అర కిలోమీటర్ దూరంలో ఈ మందిరం ఉంటుంది. కాశీకి వెళ్లినవారు తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని కూడా దర్శించుకుంటారు. అందుకే ఎప్పుడూ ఈ ఆలయం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. బృహస్పతికి శివ భక్తి పరాయణుడు. అందుకే ఆయన దేవతల గురువుగా నియమితుడయ్యాడని చెబతారు. మహాదేవుడు కాశీని రాజధానిగా చేసుకోవడంతో దేవతలంతా కూడా కాశీకి మకాం మార్చాలని భావించి శివయ్యను అనువైన స్థలం కోసం వేడుకున్నాడట. అలా శివుడు వారందరికీ కాశీలో అనువైన స్థలాన్ని ప్రసాదించాడని చెబుతారు.
