పుష్పగిరి క్షేత్రం కడప నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో, ఐదు నదులు కలిసే ప్రాంతంలో కొండపై విరాజిల్లిన హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శివ స్వరూపం వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపం చెన్నకేశవస్వామి ఒకే ఆవరణలో కొలువైన పుణ్యక్షేత్రం ఇది. పూరాణాల ప్రకారం, వాయు దేవుడు కైలాస పర్వతం నుంచి ఒక భాగం తీసుకొచ్చి ఇక్కడి కోనేరులో వేశారని తదుపరి కాలంలో అదే పుష్పగిరి ఏర్పడిందని నమ్మకం. కొండపై చెన్నకేశవాలయం, సంతానమల్లేశ్వరాలయం, ఉమామహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర ఆలయాలు ఉండగా…దిగువున వైద్యనాదేశ్వర, త్రికూటేశ్వర, భీమలింగేశ్వర, కామాక్షి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. పుష్పగిరి క్షేత్రంలో ఆలయ శిల్పాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎటు చూసినా కనువిందుగా శిల్పాలు దర్శనమిస్తాయి. ముఖ్యంగా బారులు తీరిన ఏనుగులు… గుఱ్ఱాలపై వీరుల విన్యాసాల శిల్పాలు మనోహరంగా ఉంటాయి. శివకేశవుల తత్వం ఒక్కటేనని ఈ క్షేత్రం మనకు తెలియజేస్తుంది.

