చార్ధామ్ యాత్ర కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ఇది నిజంగా శుభవార్త. 2026లో ఈ మహా తీర్థయాత్ర గత ఏడాదితో పోలిస్తే 11 రోజులు ముందుగానే ప్రారంభం కానుంది. ఏప్రిల్ 19న అక్షయ తృతీయ పవిత్ర రోజున గంగోత్రి, యమునోత్రి ద్వారాలు తెరచుకోవడంతో యాత్రకు శ్రీకారం చుడతారు. ‘అక్షయం’ అంటే ఎప్పటికీ తగ్గనిది… ఆ రోజున చేసిన దర్శనం, దానం శాశ్వత ఫలితాలను ఇస్తాయని భక్తుల విశ్వాసం. ప్రయాణ సమయం పెరగడంతో దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికులకు ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం లభించనుంది. గతంలో ఎదురైన ఆటంకాల నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు చేస్తోంది. రోడ్లు, భద్రత, వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆలయాల్లో మొబైల్ నిషేధంతో భక్తి మరింత గాఢంగా మారనుంది. ఇది కేవలం యాత్ర కాదు… ఒక ఆధ్యాత్మిక పునఃప్రారంభం.

