పరమేశ్వరుడి ఆలయం లేని ఊరంటూ ఉండదు. కొన్ని ఆలయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటిలో ఒక ఆలయాన్ని దర్శించుకుంటే అక్కడి పరమేశ్వరుడు మధుమేహం (డయాబెటిస్) వ్యాధిని నయం చేస్తుందని చెబుతారు. ఆ ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయ విశేషాలేంటి తెలుసుకుందాం. ‘కరుంబేశ్వరర్’ అంటే చెరకు దేవుడు అని అర్థం. ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. దీనితో బాధపడేవారంతా ఈ ఆలయానికి వెళతారు. అయితే షుగర్ వ్యాధిని తగ్గించుకోవాలంటే.. ఒక సాధారణ, విచిత్రమైన ఆచారం పాటించాల్సి ఉంటుంది. ఆ ఆచారం ఏంటనేది కూడా తెలుసుకుందాం. కరుంబేశ్వరర్ ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని కోయిల్వెన్ని చెరకు మైదానాలలో ఉంది.

ఇది ఈనాటి ఆలయం కాదు.. ఇది 1300 ఏళ్ల నాటి ఆలయం. ఇక్కడ శివుడిని కరుంబేశ్వరర్ అంటే ‘చెరకుకు ప్రభువు’ అని అర్థం. నయనార్ల 275 శివ స్థలాలలో ఇదొకటి. పాజిటివ్ ఎనర్జీకి ఈ ఆలయం కేంద్రంగా పేర్కొంటారు. ఇక్కడి శివలింగం కూడా అన్ని ఆలయాల్లోని శివలింగాలకు చాలా భిన్నంగా ఉంటుంది. శివలింగం ఎలా ఉంటుందంటే.. చెరుకు కాండాల సమూహాన్ని కలిపినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్లినవారు చీమలకు, చిన్న చిన్న కీటకాలకు ప్రసాదం పెడతారు. చీమలు ప్రసాదం తింటుంటే ఆ పెట్టిన వారి శరీరంలో చెక్కర స్థాయి తగ్గుతుందని చెబుతారు. ఈ ఆలయానికి వెళ్లాలంటే ముందుగా కుంభకోణం వెళ్లాలి. అక్కడి నుంచి కరుంబేశ్వరర్ క్షేత్రం 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కుంభకోణం నుంచి స్థానిక టాక్సీ సేవలు లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అమ్మాపేటైకి చేరుకుంటే.. ఇక్కడి నుంచి ఆలయం 4 కి.మీ దూరంలో ఆలయం ఉంటుంది.
