
పాశాంకుశ ఏకదాశి లేదంటే పాపాంకుశ ఏకదాశి గురించి తెలుసా? ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ “ఆశ్వయుజ శుద్ధ ఏకాదశికి మరొక పేరు ఏమిటి? దాని ఫలితం ఏమిటి?” అని అడిగాడట.. అప్పుడు శ్రీకృష్ణుడు ఆనందంగా సమాధానంగా “ఓ ధర్మరాజా! ఈ ఏకాదశిని పాశాంకుశ లేదా పాపాంకుశ ఏకాదశి అని పిలుస్తారు. దీన్ని ఆచరించినవారికి సమస్త పాపాలు నశించి, అన్ని శుభఫలితాలు కలుగుతాయి. ఈ తిథి నాడు పద్మనాభ స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాదించాలి.” అని చెప్పాడు. ఈ వ్రతాచరణ వలన ధర్మార్థకామమోక్షాలు లభిస్తాయి. సకల తీర్థ స్నాన ఫలితాన్ని అందిస్తుంది. నరకయాతనలో ఉన్నవారు సైతం విముక్తి పొందుతారు.
శాస్త్రబోధ ఏంటంటే.. భగవంతుడిని అవమానించే వారు ఎన్ని వ్రతాలు చేసినా సత్ఫలితం పొందరు. ఈ ఏకాదశిని పాటించని వారు యజ్ఞాలు చేసినా ఫలితం రాదు. కాబట్టి శాస్త్రాలు “ఏకాదశి వ్రతం కన్నా గొప్పది లేదు” అని ఘోషిస్తున్నాయి. ఏకాదశి ఆచరణ ఏంటంటే.. ఉపవాసం, కృష్ణసేవ, హరినామ జపం, కథా శ్రవణం చేయాలి. రాత్రి జాగరణ ప్రత్యేక ఫలప్రదం. ఈ వ్రతాన్ని ఆచరించిన వారి పది తరాల పితృమాతృలు ఉద్ధరింపబడతారు. బాలులు, యువకులు, వృద్ధులు—ఎవరు అయినా ఈ వ్రతం పాటించవచ్చు. ఈ రోజున దానాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున తిల, సువర్ణం, భూమి, జలం, గొడుగు, పాదుకలు దానం చేస్తే యమలోక నరకబాధలు ఉండవట. ఈ వ్రతాన్ని ఆచరించినవారు.. దీర్ఘాయుష్షు పొందుతారు. ధనధాన్య సమృద్ధితో సుఖంగా జీవిస్తారు. సర్వదోషాల నుంచి విముక్తి పొంది భగవత్ లోకానికి చేరుకుంటారట.
