
విజయదశమి నాడు శ్రీరామచంద్రుడు రాక్షసాధిపతి రావణుడిని సంహరించి, సీతాదేవిని తిరిగి పొందాడు. అందుకే ఈ రోజున ధర్మం అధర్మంపై సాధించిన ఘన విజయంగా జరుపుకుంటారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ రోజున రావణ దహనం చేస్తారు. అమ్మ మహిషాసుర మర్దిని రూపంలో మహిషాసురుడిపై గెలిచి దేవతలకు శాంతిని ప్రసాదించింది. ఈ ఘన విజయానికి గుర్తుగా నవరాత్రుల ముగింపు రోజుగా విజయదశమి ఆచరించబడుతుంది. మహాభారతంలో పాండవులు వనవాసం ముగించి తిరిగి యుద్ధానికి సిద్ధమయ్యే ముందు శమీ వృక్షంలో దాచిన ఆయుధాలను విజయదశమి రోజున తిరిగి పొందారు.
అందుకే ఈ రోజున ఆయుధ పూజ, శమీపూజ ఆచారం విస్తృతంగా ఉంది. ఈ రోజు అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచితనం, అంధకారంపై వెలుగు గెలవడాన్ని సూచిస్తుంది. మనలోని క్రోధం, లోభం, ద్వేషం అనే రాక్షసులను జయించి, శాంతి, ధర్మం, భక్తి అనే దైవత్వాన్ని ఆహ్వానించమని సందేశం ఇస్తుంది. విజయదశమి ఆచారాలు ఏంటంటే.. విద్యారంభం చేయడం శ్రేష్ఠమైన రోజు.. పనిముట్లు, పుస్తకాలు, ఆయుధాలు పూజించడం. శమీపూజ చేసి స్నేహితులంతా శమీపత్రాలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇలా చేస్తే సువర్ణం లాంటి శుభఫలితం వస్తుందని నమ్మకం. కొత్త పనులు, కొత్త ప్రారంభాలకు ఇవాళ ఉత్తమమైన సమయంగా భావిస్తారు.
ప్రసిద్ధ ఆలయాలు.. నిర్వహించే ఉత్సవాలు
అయోధ్య, వారణాసి, నాసిక్ – రామలీల ఉత్సవాలు, రావణ దహనం
కొల్కతా, అస్సాం, ఒడిశా – దుర్గాపూజా ఉత్సవాలు అత్యద్భుతంగా
మైసూరు – చాముండేశ్వరి దసరా ఘనతతో
తిరుమల – శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ కాలంలోనే జరుగుతాయి
