
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ తెప్పోత్సవాల్లో భాగంగా 6వ రోజు శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజ స్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. తెప్పలను అధిరోహించిన స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. ఈ తెప్పోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
