
తమిళనాడులోని నామక్కల్ జిల్లా కేంద్రమైన నామక్కల్లో కొండ దిగువన వెలిసిన ఆంజనేయుడి గురించి తెలుసుకున్నాం. ఈ హనుమంతుడు 15 ఏళ్లుగా పైకప్పు లేకుండానే ఉన్నాడు. రోజురోజుకీ పెరుగుతుండటం ఈ ఆంజనేయుడి ప్రత్యేకత. అయితే ఈ ఆంజనేయుడికి ఎదురుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరి ఉన్నాడు. ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సైతం పైకప్పు ఉండకపోవడం విశేషం. దీనికి స్పష్టమైన కారణమైతే ఎవరికీ తెలియదు. ఈ ఇద్దరు దేవుళ్లలో ఒకరి ఆలయానికి పైకప్పు లేకపోవడం వలన మరొకరి ఆలయానికి నిర్మించలేదని కూడా చెబుతారు.
హనుమంతుడి విగ్రహం రోజురోజుకీ పెరుగుతుండటం వల్లనే ఆయనకు పైకప్పు లేదనేది చాలా మంది భావన. ఇక ఆలయ స్థల పురాణం ఏంటంటే.. పూర్వం హిరణ్యకశ్యపుని సంహారం తర్వాత నరసింహ స్వామి ఈ ప్రాంతంలో హనుమంతునికి దర్శనమిచ్చాడట. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎదురుగా నరసింహ స్వామి విగ్రహం కూడా ఉంటుందని చెబుతారు. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి మాత్రం స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఈ ఆంజనేయుడికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. నామక్కల్ కోట దిగువ భాగంలోని నరసింహ స్వామి ఆలయానికి దాదాపు 100 మీటర్ల దూరంలో ఆంజనేయుడు వెలిశాడు.
