![]()
శివుడి సంహార రూపాల గురించి తెలుసుకుంటున్నాం కదా.. శివుడి సంహార రూపాలు జలంధర వధమూర్తి, త్రిపుర సంహారమూర్తి, మన్మథ సంహారమూర్తి, గజ సంహారమూర్తి, కాల సంహారమూర్తి అనే ఐదు ఉన్నాయని తెలుసుకున్నాం. వాటిలో జలంధర వధ మూర్తి, త్రిపుర సంహారమూర్తి గురించి ఇప్పటికే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన మూడు రూపాల గురించి తెలుసుకుందాం. మన్మథుడు తన బాణంతో శివుడి తపస్సును భగ్నం చేసిన కథ మనందరికీ తెలిసిందే. తన తపస్సును భగ్నం చేసిన మన్మథుడిని తన త్రినేత్రాన్ని తెరిచి శివుడు సంహరించాడు.
ఇక ఇప్పుడు గజ సంహారమూర్తి గురించి తెలుసుకుందాం. మహిషాసురుడి పుత్రుడైన గజాసురుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. తపస్సును మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమవగా.. కామాన్ని జయించినవాని చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు. అప్పుడు కామదహనుడైన కాశీనాథుడు గజాసురుడిని సంహరించాడు. చివరిది కాల సంహారమూర్తి. మార్కండేయుడి ప్రాణాలు తీసేందుకు యముడు రాగా.. శివలింగాన్ని ఆలింగనం చేసుకుని బాలభక్తుడైన మార్కండేయుడు ఆర్తిగా ప్రార్థించాడు. అప్పుడు నీలకంఠుడు కాల సంహారమూర్తి రూపమెత్తి ఏకంగా యుముడినే సంహరించాడు.
