Site icon Bhakthi TV

హసనాంబ ఆలయంలోని విచిత్రం ఏంటంటే..

కర్ణాటకలోని హసనాంబ ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. బెంగుళూరు నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఈ రహస్య హాసనాంబ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయంలోని అద్భుతం ఏంటంటే.. దీపావళి సమయంలో ఏడు రోజుల పాటే ఆలయం తెరిచి ఉంటుందని చెప్పుకున్నాం కదా..ఈ ఆలయాన్ని తెరవగానే అమ్మవారి ముందు స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగిస్తారు. అలాగే అమ్మవారి గర్భగుడిని పూలతో అలంకరిస్తారు. ఈ దీపంతో పాటు అమ్మవారికి సమర్పించిన పువ్వులు సంవత్సరం పాటు అలాగే ఉంటాయి. ఏడాది తర్వాత ఆలయ తలుపులు తెరిస్తే దీపం కొండెక్కకుండా అలాగే వెలుగుతూ ఉంటుంది. ఇక అమ్మవారికి సమర్పించిన పువ్వులు ఏడాది తర్వాత కూడా అలాగే తాజాగా ఉంటాయి.

ముందుగా ఈ వింతను చూసేందుకు ఆలయం తెరిచే రోజున పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఇక అమ్మవారికి ఈ వారం రోజుల పాటు బియ్యంతో చేసిన వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. హసనాంబ ఆలయం గురించి ఓ కథ ఉంది. అదేంటంటే.. అంధకాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి తన రక్తం చుక్క నేలపై పడితే తిరిగి పుట్టే వరం పొందాడట. అప్పటి నుంచి దేవతలను, రుషులను హింసించే వాడట. వారందరూ వేడుకోవడంతో అంధకాసురుడిని సంహరించే బాధ్యత శివుడు తీసుకున్నాడట. కానీ రాక్షసుడి శరీర నుంచి కారిన ప్రతి రక్తపు చుక్క రాక్షసుడిగా మారుతోందట. అప్పుడు అతన్ని సంహరించేందుకు యోగేశ్వరి దేవిని శివుడు సృష్టించి ఆమె ద్వారా అంధకాసురుడిని సంహరించాడట. ఆ యోగేశ్వరీదేవి ఇక్కడ వెలిసిందని నమ్మకం.

Share this post with your friends
Exit mobile version