Site icon Bhakthi TV

భారతంలోని కొన్ని పాత్రల నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే..

1. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి, మీ ఆధీనంలోంచి దూరం అవుతారు… వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు. ఉదా: కౌరవులు

2. నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ… ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ… వాటిని “అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగమవడంతో పాటు నువ్వు కూడ వినాశనం అవుతావు. ఉదా: కర్ణుడు

3. యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే ‘వినాశం’ జరుగుతుంది. ఉదా:అశ్వత్థామ.

4. విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బతకవలసి వస్తుంది. ఉదా: భీష్ముడు

5. సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే తనకే కాదు, తన వారందరికి వినాశం తప్పదు. ఉదా: దుర్యోధనుడు

6. స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు, గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం కలిగిన వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది. ఉదా: ధృతరాష్ట్రుడు

7. శక్తి యుక్తులకి, తెలివితేటలకి ధర్మం తోడైతే విజయం తప్పక లభిస్తుంది. ఉదా: అర్జునుడు.

8. ఒక మంచి శత్రువుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం. ఉదా: శకుని

9. నీవు నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు, నీ వాళ్ళకి హానిచేయదు. ఉదా: యుధిష్ఠిరుడు

10. అందరి బంధువైనా… అన్నీ తెలిసినా, చివరకి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్యధర్మం కూడా. ఉదా: శ్రీకృష్ణుడు

11. కోటి కథల, లక్షల వ్యధల, వేల ఉపకథల, 100 మంది శత్రువుల, 5గురు మిత్రుల (అందరు సోదరులే)… నాలుగు ధర్మాల సారాంశమే భారతం

Share this post with your friends
Exit mobile version