Site icon Bhakthi TV

నిమజ్జనం ఆచారమున్న పండుగలన్నీ వర్షాకాలంలోనే ఎందుకు వస్తాయో తెలుసా?

వర్షఋతువులో వచ్చే భాద్రపదమాసంలో విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలుచుకోవడమే వినాయక చవితి. ఈ పండుగ ప్రకృతికి అనుగుణంగా సాగుతుంది. అంటే నదులు, లేదంటే వాగుల నుంచి ఒండ్రుమట్టిని తెచ్చి స్వామి ప్రతిమను రూపొందించి ఏకవింశతి పత్రి పూజ పేరుతో 21 రకాల ఆకులతో విఘ్నేశ్వరుడిని పూజిస్తాం. తొమ్మిది రోజుల పాటు స్వామివారిని కొలుచుకున్న మీదట గణపతిని గంగమ్మ ఒడికి చేరుస్తాం. దానినే నిమజ్జనం అంటాం. వినాయక పూజలో సృష్టి, స్థితి, లయ అనే మూడు దశలు ఉంటాయి. వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం శాస్త్రీయ కారణాలున్నాయి.

ఒండ్రు మట్టిలోనూ, మనం ప్రకృతి నుంచి తీసుకొచ్చే పత్రిలోనూ ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ తొమ్మిది రోజుల పాటు మనం గణపతికి శోడషోపచార పూజ నిర్వహిస్తాం. ఈ పూజ సమయంలో ఈ విగ్రహాన్నీ, పత్రాలనూ తాకడం వల్ల వాటిలోని ఔషధి తత్వం మనకి చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు విగ్రహంతో పాటే పత్రిని కూడా ఇంట్లో ఉంచుతాం. కాబట్టి ఆ రెండింటి కారణంగా చుట్టూ ఉన్న గాలిలోకి ఔషధి గుణాలు వచ్చి చేరుతాయి. ఆ తరువాత విగ్రహాన్ని ఏదైనా జలాశయం లేదా బావిలో నిమజ్జనం చేస్తాం. ఇలా చేయడం వలన వర్షాకాలంలో వాగులు, నదుల్లో వరద పోటు తగ్గి.. నీరు క్రిమిరహితంగా మారిపోతుందట. కాబట్టి నిమజ్జనం చేసే ఆచారమున్న వినాయకచవితితో పాటు దసరా కూడా ఈ సమయంలోనే వస్తుంది.

Share this post with your friends
Exit mobile version