బ్రహ్మదేవుడికి ఆలయాలనేవి చాలా అరుదు. దీనికి కారణం శివుని శాపమేనని అంటారు. బ్రహ్మదేవునికి పూజార్హత లేకుండా శివుడు శపించాడట. అందుకే మన దేశంలో ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే అరుదుగా కనిపించే బ్రహ్మ దేవుని ఆలయాల్లో ఒకటి మాత్రం తమిళనాడులో ఉంది. దీనిని బ్రహ్మపురీశ్వర ఆలయమని.. సాక్షాత్తు బ్రహ్మదేవుని తలరాతనే మార్చిన ఆలయమని చెబుతారు. అలాంటి ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు తలరాతలు కూడా మారుతాయని అంటారు. ఈ ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న తిరుపత్తూరులో ఉంది.
బ్రహ్మపురీశ్వర ఆలయం ప్రధానంగా శైవ క్షేత్రం. అయినా కూడా ఇక్కడ బ్రహ్మదేవునికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. పరమేశ్వరుడు, బ్రహ్మ ఇద్దరూ కొలువుదీరిన క్షేత్రం కాబట్టి దీనికి బ్రహ్మపురీశ్వర ఆలయమని పేరు వచ్చింది. గర్భాలయంలో శివుడు స్వయంభూ లింగ రూపంలో ఉన్న బ్రహ్మపురీశ్వరుడుగా కొలువుదీరగా.. అమ్మవారు.. బ్రహ్మ సంపత్ గౌరి పేరుతో కొలువుదీరింది. ఈ ఆలయ ప్రాంగణంలోనే బ్రహ్మకు ప్రత్యేక మందిరం ఉంది. బ్రహ్మ విగ్రహం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడ బ్రహ్మ దేవుడు.. పద్మాసనంలో తామరపువ్వుపై ధ్యాన భంగిమలో కూర్చున్నట్టుగా ఉంటుంది.
