Site icon Bhakthi TV

తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి తెప్పోత్సవాల కోసం తెప్పలను అందంగా అలంకరించారు. పువ్వులు, విద్యుద్దీపాల నడుమ స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. ఈ తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.

రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడుసార్లు విహరిస్తూ భ‌క్తుల‌ను క‌టాక్షించారు. వేదం, గానం, నాదం మ‌ధ్య తెప్పోత్స‌వం వేడుక‌గా జ‌రిగింది. కాగా, మూడవరోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు తిరుచ్చిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుసార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, వీజీవో శ్రీ రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version