
తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్వో శ్రీ సతీష్ పెరేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులు, 251 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో ఏడుగురు ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ఇంటర్లో ప్రతిభ కనబరిచిన 19 మంది విద్యార్థులకు 2,116/-, 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 55 మంది విద్యార్థులకు 1,116/- నగదు బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు “ఏ దేశమేగినా ఎందు కాలెడినా…..”, ” భవతు భారతి…” తదితర దేశభక్తి గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు.
