Site icon Bhakthi TV

భగవంతుడి సేవే ప‌ర‌మావ‌ధిగా శ్రీ తిరుమ‌ల‌నంబి కైంక‌ర్యం

భగవంతుడి సేవే ప‌ర‌మావ‌ధిగా భావించి శ్రీ తిరుమ‌ల‌నంబి జీవితం మొత్తాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి కైంక‌ర్యానికి అంకితం చేశార‌ని శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి అన్నారు. ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవం సోమవారం తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి అనుగ్రహ‌భాష‌ణం చేస్తూ, శ్రీ తిరుమ‌ల‌నంబి తన తాతగారు అయిన శ్రీ యమునాచార్యుల ఆజ్ఞతో తిరుమలకు వచ్చి పాపవినాశనం తీర్థం నుండి ప్రతిరోజూ జలాన్ని తీసుకువ‌చ్చి శ్రీవారిని అభిషేకించేవారన్నారు.

వృద్ధాప్యంలో కూడా పాపనాశనం తీర్థం నుండి తీసుకువస్తున‌ప్పుడు స్వామివారు జాలిపడి అంజనాద్రిలో ఉద్భవింపచేసిన ఆకాశగంగ తీర్థంతో అభిషేకం చేయవలసిందిగా ఆజ్ఞాపించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. సాక్షాత్తు భ‌గ‌వంతుడు ఉప‌దేశించిన భ‌గ‌వ‌ద్గీత‌లోని 700 శ్లోకాల‌ను సంగ్రహించి శ్రీ య‌మునాచార్యులు 32 శ్లోకాల‌తో గీతార్థ సంగ్రహం పేరుతో గ్రంథం ర‌చించార‌ని చెప్పారు. ఈ శ్లోకాలు బ్రహ్మవిద్యతో స‌మాన‌మైన‌వ‌ని కొనియాడారు.

అనంతరం టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య్య చౌదరి మాట్లాడుతూ, శ్రీవేంకటేశ్వరస్వామివారికి తీర్థ కైక‌ర్యం చేసిన తిరుమ‌ల ప్రథ‌మ పౌరుడు శ్రీ తిరుమలనంబి అని అన్నారు. శ్రీవారి కైంకర్యాలు చేసేందుకు శ్రీ తిరుమలనంబి 973వ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. తిరుమలనంబి స్వామివారికి పుష్పకైంకర్యం, మంత్రపుష్పకైంకర్యం, వేద‌పారాయ‌ణ కైక‌ర్యం, ఇతర కైంకర్యాలను చేస్తూ తిరుమలలో ఉంటూ అపరభక్తుడిగా నిలిచాడని చెప్పారు. శ్రీ మలయప్ప స్వామివారి వైభవాన్ని నలుదిశలా చాటడానికి కృషి చేసిన పరమ భక్తుల జన్మదినాల సందర్భంగా ప్రతి సంవత్సరం వారి పేరుపై ఉన్న ఉప ఆలయాల్లో వార్షికోత్సవాలు టీటీడీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

Share this post with your friends
Exit mobile version