
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రతి ఏటా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది డిసెంబరు 15న కార్తీక దీపోత్సవం ఘనంగా జరుగనుంది. ఈ కార్యక్రమమంతా ఆసక్తికరంగా కొనసాగనుంది. ముందుగా 15న సాయంత్రం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుంచి కార్తీక దీపం, వస్త్రాలను తీసుకువస్తారు. వీటిని ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించనున్నారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో డిసెంబరు 15న సాయంత్రం కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఆలయానికి కూడా శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుంచే కార్తీక దీపం, నూతన వస్త్రాలు తీసుకొస్తారు. కార్తీక దీపోత్సవంలో భాగంగా సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకువచ్చి, కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరుకానున్నారు.
