Site icon Bhakthi TV

శ్రీ‌వారి పెద్ద శేష వాహ‌న సేవాలో నయనానందకరంగా కళా ప్రదర్శనలు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో మొద‌టి రోజైన శుక్ర‌వారం రాత్రి పెద్ద శేష‌ వాహ‌న సేవ‌లో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 14 క‌ళాబృందాలలో 410 మంది క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒడిస్సీ నృత్యం, తమిళనాడుకు చెందిన లతారవి ఆధ్వర్యంలో మయూర నృత్యం, కేరళ రాష్ట్రానికి చెందిన వీణ బృందం యక్షగానం, కర్నాటక కళా రూపమైన వీరగాశను చేతన్ బృందం అద్భుతంగా ప్ర‌ద‌ర్శించారు.

శ్రీకాకుళం నుంచి శ్రీ‌మ‌తి దుర్గా భవానీ, తిరుమల నుంచి శ్రీనివాసులు, రాజమండ్రి నుండి శ్రీ‌సురేష్ బాబు, తిరుపతి బాలమందిర్ విద్యార్థులు కోలాటాలతో మంత్ర ముగ్ధుల‌ను చేశారు. హైదరాబాదుకు చెందిన శ్రీ‌మ‌తి లక్ష్మీదేవి బృందం ఒగ్గుడోలుతోను, తిరుపతికి చెందిన డాక్టర్ మురళీకృష్ణ బృందం మోహినీయట్టంతోను, కర్నాటకకు చెందిన శ్రీ‌మ‌తి వనీష బృందం పటకునిత కళా విన్యాసం, శ్రీ రవికుమార్ చిలిపిలి గొంబె నృత్యం, శ్రీ నాగేంద్ర బృందం కంసాలి రూపకంతో తమ అద్భుతమైన ప్రదర్శనలతో భక్తులకు నయనానందాన్ని కలిగించారు.

Share this post with your friends
Exit mobile version