Site icon Bhakthi TV

తిరుమల, తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పు

ప్రతినెలా మొదటి మంగళవారం తిరుమల, తిరుపతి స్థానికులకు తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న స్థానిక కోటా దర్శనాల్లో ఈనెల స్వల్ప మార్పు చేయడమైనది. ఈనెల మొదటి మంగళవారమైన 4వ తేది రథసప్తమి పర్వదినం రావడంతో భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో మంగళవారమైన 11వ తేదికి స్థానిక కోటా దర్శనాలను మార్పు చేయడమైనది.ఈ మేరకు తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలోని మహతీ ఆడిటోరియంలో 9వ తేది ఆదివారం టోకెన్లను జారీ చేయనున్నారు. స్థానికులు ఈ మార్పును గమనించి టోకెన్లు పొందాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.

మరోవైపు తిరుమలలో రథసప్తమికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటికప్పుడు టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన జరిగే రథ సప్తమి రోజున తిరుమలకు రెండు నుంచి మూడులక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఉదయం నుంచి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ వాహన సేవలను వీక్షించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

Share this post with your friends
Exit mobile version