Site icon Bhakthi TV

యూట్యూబ్ ద్వారా అన్నమయ్య సంకీర్తనలు చేరవేయాలని టీటీడీ ఆదేశాలు

పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను ప్రజలందరికీ, ముఖ్యంగా యువ‌త‌కు యూట్యూబ్ ద్వారా చేరువ‌చేయాల‌ని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో ఈవో, వివిధ విభాగాల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇప్పటికే పరిష్కరించబడిన అన్నమయ్య సంకీర్తనలను ఎస్వీబీసీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం నిపుణుల‌తో క‌మిటీని ఏర్పాటు చేసి, వారి సలహాలు, సూచనలతో వేగ‌వంతంగా సంకీర్తనల‌ను యూట్యూబ్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేయాల‌న్నారు.

తిరుపతిలోని వివిధ ప్రాంతాల‌లో జరుగుతున్న ఇంజినీరింగ్ పనులను స‌కాలంలో పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా వేస‌వి సంద‌ర్భంగా టీటీడీ స్థానిక ఆలయాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఆసౌక‌ర్యం క‌లుగ‌కుండా, భ‌క్తుల అధిక ర‌ద్ధీ నేప‌థ్యంలో తీసుకోవ‌ల‌సిన‌ జాగ్రత్తలపై జేఈఓ శ్రీ వీర బ్రహ్మంకు ప‌లు సూచనలు చేశారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలోని వివిధ ప్రాజెక్ట్‌లలో జరుగుతున్న కార్యక్రమాలపై అధికారులతో ఆయ‌న‌ చర్చించారు. అనంత‌రం తిరుప‌తిలోని ఆరోగ్య విభాగం, శ్వేత‌, టీటీడీ కొనుగోళ్ల విభాగం, స్విమ్స్‌, విద్యా, వైద్యం, తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ స‌మావేశంలో వేద‌ విశ్వవిద్యాలయం విసి శ్రీ రాణి సదాశివమూర్తి, ఎఫ్ ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version