Site icon Bhakthi TV

కోటి గాజుల అర్చన, మహా రుద్రాభిషేకం, ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ కల్యాణం


ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన దీపయజ్ఞం కోటిదీపోత్సవం ఎనిమిదో రోజుకు చేరింది.. ‘దీపం జ్యోతిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీప నమోస్తుతే..” అంటారు.. ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు.. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుంది.. అదే ఒకే చోట కోటి దీపాలను వెలిగించి.. ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ.. లక్ష దీపాలతో ప్రారంభమైన ఈ మహా యజ్ఞం కోటికి చేరుకుని.. తెలుగు రాష్ట్రాలలోని భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటుంది.

ఇక, అమ్మలగన్న అమ్మకు కోటి గాజుల అర్చన, నాగసాధువులచే మహా రుద్రాభిషేకం, ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ కల్యాణం ఘనంగా జరిగింది. ఈ కోటి దీపోత్సవం నాగసాధువులచే మహా రుద్రాభిషేకం కొనసాగింది. సౌభాగ్యదాయకం.. సర్వమంగళదాయకం భక్తులచే అమ్మలగన్న అమ్మకు కోటిగాజుల అర్చన జరిగింది. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కల్యాణం సందర్భంగా సింహవాహనంపై ఆదిపరాశక్తి అద్భుత సాక్షాత్కారం.. కంచి కామాక్షి దేవి, కొల్హాపూర్‌ మహాలక్ష్మి భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది.

మైసూర్‌ అవధూత దత్తపీఠం శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీర్వచనం ఇచ్చారు. ఉడుపి పెజావర్‌ మఠం శ్రీవిశ్వప్రసన్న తీర్థస్వామి ఆశీర్వచనం అందించారు. పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు ప్రవచనామృతం చేయగా.. అద్భుత కళాసంబరాలు, అద్వితీయ భక్తినీరాజనాలు అందుకున్నారు. ఇలా ఎన్నో అద్భుత ఘట్టాలకు ఎన్టీవీ, భక్తిటీవీ ఆధ్వర్యంలో కోటిదీపోత్సవం వేదికైంది. ఈ దీపయజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉచితంగా అందజేసింది.

Share this post with your friends
Exit mobile version