
“శ్రావణే వర్జయేత్ శాకం
దధి భద్రపదే తథా!
దుగ్ధ మాశ్వయుజే మాసి
కార్తికే ద్విదళాం తథా!!”
శ్రావణ మాసంలో కూరగాయలను, భాద్రపద మాసంలో పెరుగును, అశ్వయుజ మాసంలో పాలు, పాల పదార్ధాలనూ, కార్తీకంలో రెండు బద్దలుగా విడివడే పప్పు ధాన్యాలూ లేదా పప్పుతో చేసిన పదార్ధాలనూ త్యజించాలని చెప్పుకున్నాం కదా. దీనికి కారణాలు ఏమిటంటే.. ఋతువులు మారుతున్న సమయంలో వ్యాధులు ప్రబలుతాయి. ముఖ్యంగా గ్రీష్మం నుంచి వర్ష ఋతువు, ఆపైన శరదృతువు కాలంలో వీటి ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఋతువుల సంధ్య కాలాన్ని యమద్రంష్టలని అందుకే అన్నారు.
శాస్త్ర రీత్యా ఆషాఢంలో కామోద్దీపకం హెచ్చు. అందుకే నూతన దంపతులను దూరంగా ఉంచుతారు. భాద్రపదంలో వర్షాలతో నదులలో నీరు బురదమయంగా ఉంటుంది. ఆ నీరు తాగితే రోగాల బారిన పడతారు. అజీర్ణం లాంటి వ్యాధులు ప్రాప్తిస్తాయి. వీటిని నియంత్రించడానికి నియమిత ఆహారం, ఉపవాసాలు ఈ నాలుగు మాసాల్లో చెయ్యాలి. వీటినే చాతుర్మాస్య నియమంగా- ఆరోగ్య రీత్యా చెప్పడం జరిగింది. ఈ నాలుగు నెలల్లో ఎన్నో పండుగలు, పర్వాలు పేరిట కట్టడి చేయడం కూడా జరిగింది. వ్రతాలు, మహాలయ పక్షాలు, శరన్నవరాత్రులు, కార్తీక స్నానాలు, శివారాధనలు ఇలా ఏర్పాటు చేసినవే.
