Site icon Bhakthi TV

శైవ, వైష్ణవ భక్తులు బొట్టు పెట్టుకోవడంలో తేడా ఎందుకు?

బొట్టు అనేది మన హిందూ సంప్రదాయం. మన పూర్వీకులు మనకు ఇచ్చిన వెలకట్టలేని సంపద. బొట్టు అనేది శుభాన్ని, మానసిక ఐశ్వర్యం, ప్రశాంతతకు చిహ్నమని చెబుతారు. అయితే ఈ బొట్టును ఒక్కొకక్కరూ ఒక్కోలా పెట్టుకుంటారు. విష్ణు భక్తులు నిలువుగానూ.. శివ భక్తులు అడ్డంగానూ విభూతి ధరిస్తారు. దీనికి పెద్దగా కారణమంటూ ఏమీ లేదని తెలుస్తోంది. నుదుటి భాగానికి అంగారకుడు (కుజుడు) అధిపతి అని చెబుతారు. అంగాకరకుడిని అగ్ని దేవుడని కూడా చెబుతారు. అగ్ని రూపాన్ని సింధూర వర్ణంతో పోల్చుతారు. పైగా బొట్టు పెట్టుకునే నుదురు ప్రాంతాన్ని జ్ఞాననేత్రం లేక మనోనేత్రం అని కూడా అంటారు.

అగ్ని రూపానికి చిహ్నంగానే నుదుటిమీద ఎర్రటి బొట్టు పెట్టుకోవడం జరుగుతుంది. బొట్టు ఎర్రదనం అగ్ని లాగా బాగా డామినేటింగ్‌గా కనపడాలనే తెల్లని విభూది పూస్తారని తెలుస్తోంది. విభూది మూడు వేళ్ళతో పూసుకుంటారు కాబట్టి మనకు మూడు గీతల లాగా కనిపిస్తుంది. ఈ మూడు గీతలను శివతత్వంగా భావిస్తారు. వైష్ణవం మొదలైన తరువాత శివ, వైష్ణవ తత్వాల తేడా కోసం మూడు వేళ్ళతో అడ్డంగా విభూది పూయడం బదులు నిలువగా పూసి దానిమీద ఎర్రటి జ్యోతి వెలిగించినట్లు బొట్టు పెట్టుకోవడం మొదలైంది. ఎవరు ఏ ఆకారంలో పెట్టుకున్నా కూడా అగ్ని దేవుడి రంగు జ్యోతి ప్రజ్వలన తెలిపే అంగారకుడిని గౌరవించేందుకేనని అంటారు.

Share this post with your friends
Exit mobile version