Site icon Bhakthi TV

గోమాతకు ఎందుకంత ప్రత్యేకత?

గ్రామాల్లోనే కాదు.. కొన్ని ఆలయాల వద్ద కూడా గోమాతను దైవంగా పూజిస్తూ ఉంటారు. గోదానం చేసినా కూడా చాలా పుణ్యమని చెబుతారు. గోపంచకాన్ని ఇళ్లు, దేవాలయాల్లో చల్లి శుద్ది చేసుకుంటారు. అసలు గోవుకు ఎందుకు అంత ప్రాధాన్యత? అంటే ఆవులను గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి. పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూపంగా వర్ణించారు. ఒక్క గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే అంటారు. ఇటువంటి స్వరూపం కలిగిన గోమాతను పూజించడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని పురాతనకాలం నుంచే ప్రతిఒక్కరూ విశ్వసిస్తున్నారు.

ముఖ్యంగా గోవు ఆసాంతం ఏదో ఒక ప్రత్యేకత ఉంది. గోవు పాదాలలో ఋణ పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతీ, నోరు లోకేశ్వరం, నాలుగు చతుర్వేదాలు, భ్రూమద్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ – ఇంద్రుడు ఉన్నారని చెబుతారు. అంతేనా.. మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ – ప్రయాగ నదులు, కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు ఉన్నాయట. అంటే గోవులో సర్వదేవతలు కొలువైనట్టే కదా.. అందుకే గోవు అంతటి ప్రత్యేకతను సంతరించుకుంది.

Share this post with your friends
Exit mobile version