
శ్రీవారి గర్భాలయానికి దక్షిణంవైపు క్రీ.శ.1586లో శ్రీ అవసరం చెన్నప్ప అనే నాయకుడు కల్యాణ మండపాన్ని నిర్మించారు. 80 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడల్పుతో 27 స్థంబాలతో నిర్మించారు. ఇందులో మధ్య భాగంలో నాలుగు చిన్న స్తంభాలు ఉన్న గ్రానైట్ వేదిక ఉన్నది. పూర్వకాలంలో ఈ కల్యాణ వేదికపై శ్రీ మలయప్పస్వామి వారికి, శ్రీదేవి భూదేవిలకు కల్యాణోత్సవం నిర్వహించేవారు.
తిరుమామణి మండపం :
బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్యగల ప్రదేశం. సుప్రభాత సేవలో భక్తులు ఇక్కడి నుండే శ్రీవారి సేవలో పాల్గొంటారు.
స్నపన మండపం :
బంగారువాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే ‘స్నపనమండపం’. క్రీ.శ.614లో పల్లవరాణి సామవై ఈ మండపాన్ని నిర్మించి, భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించింది. ఈ స్నపనమండపాన్నే తిరువిలాన్ కోయిల్ అంటారు. ఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించబడిందని చెబుతారు.
