Site icon Bhakthi TV

సీతమ్మ అగ్ని పరీక్షను ఎదుర్కొన్న ప్రాంతం ఎక్కడుందంటే..

దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో ఈ రోజు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే రావణుడి లంకలో ఈ పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. శ్రీలంకలో దసరా పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ సీతమ్మ ఆలయాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ దసరా పండుగ నాడు రావణ దహనం వంటి కార్యక్రమాలేమీ ఉండవు. ఇక్కడ మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. లంకలో ముఖ్యంగా మూడు ప్రాంతాల్లో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. వాటిలో సీతమ్మ అగ్ని పరీక్షను ఎదుర్కొన్న ప్రాంతం కూడా ఉంది.

దివురుంపోల ఆలయం: ఈ ఆలయం సీతా ఎలియా నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతం గురించి హిందూ పురాణాల్లోనూ ప్రస్తావన ఉంది. సీతాదేవిని రావణుడి చెర నుంచి విడిపించాక అమ్మవారు అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న ప్రదేశం ఇదేనని చెబుతారు. దీనిని అక్కడి వారు అత్యంత పవిత్ర ప్రదేశంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ దసరా పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు.

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం: శ్రీలంకలోని కొలంబో నుంచి 45 నిమిషాల పాటు ప్రయాణిస్తే రామభక్తుడైన హనుమంతుడి ఆలయం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయుడిగా మనకు దర్శనమిస్తాడు. దసరా పండుగ ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది.

సీతా అమ్మన్ ఆలయం: సీతాదేవిని ఉంచిన ప్రదేశంలో నిర్మించిన ఆలయమే సీతా అమ్మన్ ఆలయం. ఇది ఈనాటిది కాదు.. సుమారు 5000 సంవత్సరాల నాటిదని నమ్మకం. ఈ ఆలయం నువారా ఎలియా నుంచి 5 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ కూడా దసరా పండుగను ఘనంగా నిర్వహిస్తారు.

Share this post with your friends
Exit mobile version