
సోమవారం వచ్చిన ప్రదోషాన్ని సోమ ప్రదోషం అని పిలుస్తారు. దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రదోష వ్రతం అనేది శివ పార్వతులకు అంకితం చేయబడిన ఉపవాసం. ప్రతి నెల కృష్ణ పక్షం, శుక్ల పక్షంలో త్రయోదశి నాడు మనం ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటాం. సూర్యాస్తమయం సమయాన్ని మనం ప్రదోష కాలంగా పేర్కొంటాం. ముఖ్యంగా ఈ రోజున శివపార్వతులను ఆరాదిస్తే వారి సంపూర్ణ ఆశీస్సులు మనకు లభిస్తాయని నమ్మకం. శివారాధనకు చాలా ముఖ్యమైన ఈ రోజున శివుడిని పూజిస్తే మన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని నమ్మకం.
అలాగే ప్రదోష వ్రతం ఆచరించడం వలన వ్యక్తి జీవితంలోని పాపాలన్నీ తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. ప్రదోష వ్రతాన్ని సాయంకాలం ఆచరిస్తారని చెప్పుకున్నాం కదా. ఉపవాసం ఉండాలనుకునే వారు మాత్రం సూర్యోదయానికి ముందు నుంచి, సాయంత్రం పూజ పూర్తయ్యే వరకూ ఉపవాసం ఉండాలి. సాయంత్రం శివాలయానికి వెళ్లి శివలింగానికి రుద్రాభిషేకం, బిల్వార్చన నిర్వహించాలి. పూజ పూర్తైన తర్వాత ఉపవాసం ముగించి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఈ రోజున దానాలకు సైతం ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ప్రదోష వ్రతం రోజున శివాలయాలలో అన్నదానం, బ్రాహ్మణులకు పెసలు, ఆకుపచ్చ రంగు వస్త్రాలు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
