Site icon Bhakthi TV

పిల్లల పెంపకం విషయంలో రామాయణం ఏం చెబుతోంది?

శ్రీ రాముడు సీతాదేవి నగలను లక్ష్మణుడికి చూపించి “ఇవి మీ వొదిన కేయూరాలేగదా! ఒక్కసారి నువ్వు కూడా గుర్తు పట్టు” అంటే అప్పుడు లక్ష్మణస్వామి అంటారు కదా..

“నాహం జానామి కేయురే *
నాహం జానామి కుండలే
నూపురే త్వభి జానామి
నిత్యం పాదాభివందనాత్”

దీనర్ధం ఏమిటంటే.. “ఓ అన్నా!వదినగారు భుజానికి పెట్టుకునే కేయూరాలు గానీ, చెవులకు పెట్టుకునే కుండలాలు గాని నే నెరుగను, కానీ ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం గుర్తు పట్టగలను. ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యం నమస్కారం చేస్తాను కాబట్టి!” అంటే.. పరస్త్రీని కన్నులెత్తి చూడని సంస్కారం

అసలు ఆడువారి ముఖంలో ముఖంపెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి ? ఈవిధమైన శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడనుండి వచ్చింది ?
తల్లి సుమిత్రాదేవి పెంపకం కారణంగా వచ్చింది. రాముడితో అడవికి వెళ్ళేటప్పుడు ఆ మహాతల్లి కొడుకుకు ఏమని చెపుతుందంటే..

“రామం దశరధం విధ్ధి,
మాం విధ్ధి జనకాత్మజాం,
అయొధ్యాం అటవీం విధ్ధి
గచ్చ తాత యధాసుఖం”

దీనర్థం ఏంటంటే.. రాముణ్ణి దశరథుడనుకో.. సీతను నన్ననుకో.. అడవిని అయొధ్య అనుకో.. హాయిగా వెళ్ళిరా నాన్నా!

ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టే లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యాడు. చీర తొలగి మత్తులో ఉన్న తారతో మాట్లాడవలసివచ్చినప్పుడు… తలవంచుకుని మాట్లాడిన అద్భుత శీలసౌందర్యం లక్ష్మణస్వామిది!

Share this post with your friends
Exit mobile version