
హిందూ పురాణాల ప్రకారం ప్రతి దేవునికి, దేవతకు ఏదో ఒక వాహనం ఉంటుంది. దుర్గాదేవికి సింహం, లక్ష్మీదేవికి గుడ్లగూబ, పరమేశ్వరుడికి నంది, విష్ణువుకి గరుడుడు, సుబ్రహ్మణ్య స్వామికి నెమలి, సరస్వతీ దేవికి హంస ఇలా ఒక్కో దేవునికి ఒక్కో వాహనం ఉంటుంది. విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి వాహనం ఎలుక. అసలు అంత పెద్ద గణపతికి చిట్టెలుక ఎలా వాహనంగా మారిందనే సందేహం చాలా మందికి ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం. ఒకసారి ఇంద్రుడు ముఖ్యులతో కొలువుదీరారు. వారిలో దేవతలు, గంధర్వులు, అప్సరసలు వంటి వారు కూడా ఉన్నారు.
ఒకపక్క ఓ విషయమై చాలా సీరియస్గా చర్చ జరుగుతుండగా.. క్రౌంచుడు అనే గంధర్వుడు సమావేశానికి భంగం కలిగించేలా అనుచితంగా ప్రవర్తించాడు. ముఖ్యమైన చర్చను పక్కనబెట్టి అప్సరసలతో సరససల్లాపాలాడుతున్నాడు. దేవతలు హెచ్చరించినా క్రౌంచుడిలో మార్పు రాలేదు. ఇంద్రుడికి పట్టరాని కోపం వచ్చింది. ఇక అంతే తక్షణమే ఎలుకగా మారాలని శపించాడు. తన తప్పు తెలుసుకున్న గంధర్వుడు వెంటనే ఇంద్రుడిని క్షమాభిక్ష కోరాడు. అయినా ఫలితం శూన్యం. ఎలుకగా మారిన తర్వాత అయినా కుదురుగా ఉన్నాడా? అదీ లేదు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.
